Fri Apr 19 2024 04:37:09 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు రాష్ట్రాల్లో నేడు,రేపు విస్తారంగా వర్షాలు
ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే తెలంగాణలోనూ వడగండ్లు..
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు, రేపు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే తెలంగాణలోనూ వడగండ్లు, భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని..అకాల వర్షాలకు కారణం అదేనని వాతావరణశాఖ అధికారులు వివరించారు. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
Next Story