Fri Dec 05 2025 22:46:25 GMT+0000 (Coordinated Universal Time)
రుషికొండ భవనంలో గంటా శ్రీనివాసరావు
విశాఖలోని రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు

విశాఖలోని రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ భవనాన్ని రుషికొండ ను తొలచి నిర్మించారని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. అయితే ఈ భవనాన్ని పరిశీలించిన గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారని, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కోసమే ఈ భవనాన్ని నిర్మించారని ఆయన తెలిపారు. ఇంత పెద్దయెత్తున ప్రజాధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.
విచారణ జరిపించి...
అయితే దీనిపై విచారణ జరపాల్సిందిగా ప్రభుత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇంత పెద్దమొత్తంలో పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గత ప్రభుత్వం విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిందని, అయినా విశాఖలో అన్ని స్థానాలను కూటమి పార్టీలకు ప్రజలు పట్టం కట్టారని ఆయన గుర్తు చేశారు. రాజధాని కంటే అభివృద్ధి చేయడమే ముఖ్యమని ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారని గంటా శ్రీనివాసరావు తెలిపారు.
Next Story

