Fri Apr 26 2024 21:53:06 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రాజధానులే ముద్దు
ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ విధానమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు
ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ విధానమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాయలసీమ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. మూడు రాజధానుల వల్ల భవిష్యత్ లో మరోసారి ప్రత్యేక రాష్ట్ర నినాదం రాదని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందేలా చూడటం ఈ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. కర్నూలులో రాయలసీమ గర్జనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అమరావతి, విశాఖపట్నంలోనూ వికేంద్రీకరణ సభలు పెడతామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
వికేంద్రీకరణతోనే ....
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అన్నారు. అందుకే తాము రాయలసీమ గర్జనకు మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు అన్నింటినీ ఒకే చోట పెట్టి ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాడని, దానిని అందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలను కూడా అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు. తన వర్గం, తన బినామీలు బాగుపడేందుకే ఏకైక రాజధాని అని చంద్రబాబు అంటున్నారని, అందరూ తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాయలసీమ గర్జనకు లాయర్లు, మేధావులు, విద్యార్థులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. సీమకు న్యాయరాజధాని కావాల్సిందేనని డిమాండ్ చేశారు.
Next Story