Sat Dec 06 2025 15:47:52 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ సెంటిమెంట్ లేదని బాబు చెప్పగలరా?
విశాఖలో రాజధాని సెంటిమెంట్ లేదని చెప్పడమేంటని టీడీపీ నేతలను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు

విశాఖలో రాజధాని సెంటిమెంట్ లేదని చెప్పడమేంటని టీడీపీ నేతలను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. సెంటిమెంట్ లేదని చంద్రబాబు చెప్పగలరా? అని నిలదీశారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో పరిపాలన రాజధాని పెడితే మీకున్న అభ్యంతరం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను ఎందుకు పట్టించుకోలేదన్నారు. విశాఖకు రాజధాని అవసరం లేదని చంద్రబాబు ఇక్కడి ప్రజలకు చెప్పగలరా? అని అన్నారు. మూడేళ్లలో వైసీపీ ఏం చేశారని ప్రశ్నిస్తున్నారని, టీడీపీ పథ్నాలుగేళ్లు పరిపాలించిందని, ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలన్నారు.
రెండేళ్లు కరోనాతోనే...
వైసీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో రెండేళ్లు కరోనాతో సమయం గడిచి పోయిందన్నారు. అయినా అభివృద్ధి పనులను ఎక్కడా ఆపలేదన్నారు. ఉత్తరాంధ్ర వాసుల చేయి పెట్టుకుని వారి చేతితోనే వారి కళ్లు పొడవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలంటూ అన్ని రకాలుగా అడ్డుపడుతున్నది టీడీపీ కదా? అని అన్నారు. దసపల్లా భూముల్లో ఎటువంటి రహస్యం లేదన్నారు. కోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం నడుచుకుందన్నారు. 130 సంవత్సరాల ఆవేదన తమదని, ఈ అవకాశాన్ని తాము కోల్పోయేందుకు ఇష్టపడటం లేదని ధర్మాన అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా ఊరుకునేది లేదని అన్నారు.
Next Story

