Thu May 09 2024 07:20:41 GMT+0000 (Coordinated Universal Time)
పవన్.. ఆయన చెబితే నువ్వుంటావా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి ధర్మాన ప్రసాదరావు సెటైర్ వేశారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి ధర్మాన ప్రసాదరావు సెటైర్ వేశారు. చెప్పేది శ్రీశ్రీ సూక్తుల, నడిచేది చంద్రబాబుతోనా అని ఆయన ప్రశ్నించారు. ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ వ్యాపారవేత్త చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతిస్తున్నారా? అని నిలదీశారు. జగన్ ను విమర్శించే అర్హత పవన్ కు ఎంత మాత్రం లేదన్నారు. ఉత్తరాంధ్ర వచ్చి రాజధాని అమారావతి అనడం ఎంతవరకూ సబబని ఆయన ప్రశ్నించారు. అమరావతి రాజధాని కొంతమంది రియల్టర్ల కోసమేనని అన్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను పవన్ కల్యాణ్ చదివారా? అని నిలదీశారు.
ఎవరో.. ఎక్కడో చెప్పగలవా?
తాను ఏ సైనికుడి భూమిని కబ్జా చేశానో చెప్పగలరా అని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఒక సైనికుడికి అసైన్డ్ భూమి ఇస్తే పదేళ్ల తర్వాత అతను అమ్ముకునే వీలుందన్నారు. ఆ భూమిని బలవంతంగా తీసుకుంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రెవెన్యూ మంత్రికి భూములు కేటాయించే నిర్ణయాధికారం లేదని ఆయన అన్నారు. రామోజీరావు ఏది చెబితే అది మీరు సభలో చెప్పేస్తారా? అని వ్యంగంగా వ్యాఖ్యానించారు. జగన్ వైపు అన్ని వర్గాల ప్రజలు చూస్తున్నారని, విద్య, ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న జగన్ ప్రభుత్వం రావాలని మళ్లీ కోరుకుంటున్నారని ధర్మాన వ్యాఖ్యానించారు. టీడీపీకి మద్దతిస్తే మీ గౌరవం పెంచదని తెలిపారు.
Next Story