Thu May 16 2024 01:18:14 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి సభ టీడీపీదే.. బొత్స ఫైర్
అమరావతితో పాటు మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
అమరావతితో పాటు మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం పార్టీకి మాత్రం ఆ 29 గ్రామాలు, ఆ సామాజికవర్గం ప్రయోజనాలే కావాలని మండిపడ్డారు. చంద్రబాబు ఆయన సామాజికవర్గం ఆస్తులు పెంచుకోవడానికే ఈ రాజధాని డ్రామా అని బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొన్న వారంతా టీడీపీ వారేనని అన్నారు. రేపు తిరుపతిలో జరిగే సభ టీడీపీ సభ అని అన్నారు.
ఎవరైనా వచ్చి చెప్పారా?
పవన్ కల్యాణ్ కు ఉత్తరాంధ్ర ప్రజలు వచ్చి తమకు పరిపాలన రాజధాని వద్దని చెప్పారా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆయన ఏదైనా క్లారిటీతో ఉంటే బాగుంటుందన్నారు. రాజధాని ఆందోళనల్లో పాల్గొన్నవారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రాజధానిపై బీజేపీ తన వైఖరిని మార్చుకుంటే తమకు అభ్యంతరం లేదని బొత్స చెప్పారు.
దోచుకోవడానికే....
రియల్ ఎస్టేట్ ద్వారా దోచుకోవడానికే అమరావతి ప్లాన్ అని బొత్స సత్యనారాయణ విమర్శించారు. సభలు పెట్టాలంటే తాము కూడా అన్ని ప్రాంతాల్లో పెట్టగలమని చెప్పారు. వ్యాపారం కోసం చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా ఇది అని అన్నారు. దీనిని తాము పెద్దగా పట్టించుకోమని, అమరావతి మాత్రమే కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని బొత్స సత్యనారాయణ వివరించారు.
Next Story