Thu Mar 19 2026 10:27:31 GMT+0530 (India Standard Time)
జీవో నెంబరు 1ని వెనక్కు తీసుకోం
జీవో నెంబరు 1ని వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ జీవో అందరికీ వస్తుందన్నారు.

జీవో నెంబరు 1ని వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ జీవో అందరికీ వస్తుందన్నారు. చంద్రబాబు బెదిరింపులకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని ఆయన అన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ లకు ఇష్టమొచ్చినట్లు పాలన సాగించలేమని అన్నారు. అలా వారి ఇష్టం వచ్చినట్లు పాలన చేయబట్టే వారు 23 సీట్లకు పరిమితమయ్యారని అంబటి రాంబాబు అన్నారు.
బాబుకు పిచ్చెక్కింది...
జీవో నెంబరు 1ను తిరస్కరస్తూ చంద్రబాబు నిబంధనలను పాటించకుండా కుప్పంలో బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఆయన పరిస్థితి చూస్తుంటే చంద్రబాబుకు పిచ్చెక్కిందని అనిపిస్తుందన్నారు. కందుకూరు, గుంటూరు ఘటనలపై ఎందుకు మాట్లాడటం లేదని అంబటి ప్రశ్నించారు. చట్టానికి ఎవరైనా సమానులేనని అన్నారు. పబ్లిక్ మీటింగ్ లు పెట్టకూడదని జీవోలో ఎక్కడా లేదని, బహిరంగ ప్రదేశాల్లోనే పెట్టుకోవాలని ఆ జీవో పేర్కొందన్నారు.ఆయన రోడ్ షోలను అడ్డుకుంటే ఏమవుతుంది? ఆయన తిరిగినంత మాత్రాన స్థానిక ఎన్నికల్లో టీడీపీ గెలిచిందా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ పిట్టల్లా రాలిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ఆయన నిలదీశారు. దత్తపుత్రుడికి ఆ మరణాలు కన్పించలేదా? అని ప్రశ్నించారు. బాధ్యత కలిగిన రాష్ట్ర ప్రభుత్వం సభల్లో మరణాలకు చోటు ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story

