Sat May 24 2025 13:16:07 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : వర్షాలు కంటిన్యూ.. ఎండల తీవ్రత కూడా అధికం... ఇదీ వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులు, తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చిత్తూరు వరకూ ఈ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. అదే సమయంలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని, ఈదురుగాలులు బలంగా వీస్తాయని, గంటకు నలభై నుంచి యాభై కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రజలకు అలెర్ట్ జారీ చేసింది.
బలమైన గాలులు...
దక్షిణ కోస్తా ప్రాంతంలో తేలికపాటి వర్షాలుపడతాయని, ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. రాయలసీమలోనూ అదే రకమైన వాతావరణం ఏర్పడుతుందని, భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు బలంగా వీస్తాయని వాతావరణ శాఖచెప్పింది. రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకోవాలని సూచించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని, రైతులు పొలాలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండి, చెట్ల కింద చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయి కాబట్టి హోర్డింగ్ లు, పెద్ద పెద్ద చెట్ల కింద ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రమాదం జరిగే అవకాశముందని హెచ్చరించింది.
నాలుగు రోజుల పాటు...
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండలు కూడా అదే సమయంలో దంచి కొడతాయని తెలిపింది. పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అదే సమయంలో సాయంత్రానికి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతాయని చెప్పింది. ఉష్ణోగ్రతలుకొన్ని ప్రాంతాల్లో గణనీయంగా తగ్గుముఖం పడతాయని తెలిపింది. శనివారం వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. అలాగని కొన్ని ప్రాంతాల్లో మాత్రం నలభై నుంచి నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్పష్టం చేసింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్...
బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించింది. ఈరోజు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, భువనగిరి, సిద్ధిపేట్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పింది. ఈ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు కూడా బలంగా వీచే అవకాశముందని హెచ్చరించింది.
Next Story