Fri Dec 05 2025 09:14:43 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : రెండు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు అలెర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నెల 27వ తేదీనాటికి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి ఒడిశా వద్ద తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావవంతో రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్నిచోట్ల మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. రైతులు, కూలీలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు దగ్గర నిలబడవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఏపీలో ఈ జిల్లాలకు...
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, అంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. కాకినాడ,అనకాపల్లి, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని, రెడ్ అలెర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, అల్లూరి, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. ఎన్టీఆర్, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో ఈ జిల్లాలకు...
తెలగాణలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. జోగులాంబ గద్వాల్ , నారాయనపేట్, వనపతర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముండటంతో మరికొన్ని రోజులు వర్షాలు తప్పవని తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో వర్ష బీభత్సం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా వాగులు, నదులు దాటే ప్రయత్నం ఎవరూ చేయవద్దని కోరింది.
Next Story

