Sat Dec 13 2025 22:33:51 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : ఆంధ్రప్రదేశలో వానలు.. తెలంగాణలో చలిగాలులు
మరికొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులుచెబుతున్నారు

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గలేదు. గత వారం పది రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరికొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులుచెబుతున్నారు. చలి తీవ్రత పెరుగుతుందని, వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. గత ఏడాదితో పోల్చుకుంటే అత్యంత కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలితీవ్రత ఉదయం నుంచి రాత్రి వరకూ కొనసాగుతున్నాయి.
ఏపీలో వానలు...
ఆంధ్రప్రదేశ్ లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలో వానలు పడే అవకాశముందని తెలిపింది. ఈ నెల 19వ తేదీ తర్వాత అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని కూడా హెచ్చరించింది. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అసలే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరాయి. ప్రధానంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు.
తెలంగాణలో చలికి...
ఇక తెలంగాణలోనూ మరికొద్ది రోజుల పాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుంచి రాత్రి వరకూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అలెర్ట్ గా ఉండాలని సూచించింది. అదే సమయంలో వృద్ధుల, చిన్నారులు, దీర్ఘకాలిక రోగులు బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. ఇళ్లలోనుంచి ఎవరూ బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్ జిల్లాల్లో అతి తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిర్పూర్ లో అత్యల్పంగా 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లోనూ అతి తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Next Story

