Fri Dec 05 2025 09:29:54 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీ కమ్మ నేతలు కామ్ అయిపోయారేంటో?
వైసీపీ లో కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు కామ్ అయిపోయారు.

వైసీపీ లో కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు కామ్ అయిపోయారు. గత ఏడాది కాలం నుంచి వారు వైసీపీలో ఉన్నారా? లేదా? అన్న సంశయం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. 2019 ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి నంబూరి శంకరరావు, వినుకొండ నియోజకవర్గం నుంచి బొల్లా బ్రహ్మనాయుడులు ఎన్నికయ్యారు. అలాగే తెనాలి నియోజకవర్గం నుంచి అన్నాబత్తుని శివకుమార్ కూడా వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇక దెందలూరు నుంచి అబ్బయ్య చౌదరి, గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీలు ఎన్నికయ్యారు. గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజికవర్గం నుంచి కొడాలి నానికి మాత్రమే కేబినెట్ లో చోటు దక్కింది.
మౌనంగానే ఉంటూ..
అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత వైసీపీలో ఉన్న కమ్మ సామాజికవర్గం నేతలందరూ మౌనంగానే ఉన్నారు. పల్నాడు జిల్లాలో ఉన్న మర్రి రాజశేఖర్ కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇక నంబూరి శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్ ల అడ్రస్ కూడా దొరకడం లేదు. మైలవరం నుంచి గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారి వెళ్లిపోయారు. మిగిలిన వారు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. గుంటూరు కార్పొరేషన్ లో వైసీపీ బలం ఉన్నప్పటికీ టీడీపీ మేయర్ పదవిని సొంతం చేసుకుంటున్నా మాజీ ఎమ్మెల్యేలుగా వీరు చేసిన ప్రయత్నాలు శూన్యమనే చెప్పాలి. కనీసం పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలకు కూడా కమ్మ సామాజికవర్గం నేతలు దూరంగా ఉంటున్నారు.
నేతల డైలమా....
దెందులూరు నియోజకవర్గంలోనూ అబ్బయ్య చౌదరి పెద్దగా యాక్టివ్ గా లేరు. అక్కడ చింతమనేని దెబ్బకు బయటకు కూడా రావడం మానుకున్నారు. ఒకరకంగా వీరిని కమ్మ సామాజికవర్గం ప్రజలు వెలివేసినట్లే కనపడుతుంది. వారు నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఇష్టడటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరసగా పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీలను అరెస్ట్ చేయడంతో కొంత కమ్మ సామాజికవర్గం నేతలు డైలమాలో పడినట్లే కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అమరావతికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండటం, తమ వైసీపీ ప్రభుత్వం రాజధానిని పట్టించుకోకపోవడంతో ఆ ఎఫెక్ట్ సొంత సామాజికవర్గం నుంచి పడుతుందని వారు అంచనా వేస్తున్నారు. అందుకే దూరంగా ఉండాలని, నాలుగేళ్లకు ముందే బయటకు వచ్చినా ప్రయోజనం లేదని భావించిన నేతలు తర్వాత చూద్దాంలే అన్న ధోరణలో ఉన్నట్లనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేసినా వైసీపీ నుంచి గెలవడం కష్టమేనని భావించి కొందరు రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పనున్నారు.
Next Story

