అవును.. భారీ మెజార్టీతో గెలిచిన నాకు బలుపే
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
![vasantha krishnaprasad, mla, mylavaram, ys jagan, mylavaram ycp mla vasantha krishnaprasad received a call from the chief ministers office, political news, andhra news vasantha krishnaprasad, mla, mylavaram, ys jagan, mylavaram ycp mla vasantha krishnaprasad received a call from the chief ministers office, political news, andhra news](https://www.telugupost.com/h-upload/2023/05/31/1506935-interesting-comments-of-ycp-mla-vasantha-krishnaprasad.webp)
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని ఉమా వైసీపీకి అనుకూల శత్రువు అని అన్నారు. మంగళవారం నాడు ఎన్టీఆర్ జిల్లా ఐతవరంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఒక్కసారి గెలిచిన కృష్ణప్రసాద్కు ఇంత బలుపా అని ఉమా మాట్లాడుతున్నారని, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమాపై 13 వేల మేజార్టీతో గెలిచిన తనకు నిజంగానే బలుపు ఉందన్నారు. అయితే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమా గెలుపు.. ఎలాంటి గెలుపో చెప్పాలని డిమాండ్ చేశారు.
అన్నావదినల బలిదానంతో దేవినేని గెలిచారని, అది ఆయన గెలుపు కానే కాదని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఎద్దేవా చేశారు. మంత్రిగా ఉన్న దేవినేనిపై 13 వేల మెజార్టీతో గెలిచిన తన గెలుపు.. అసలైన గెలుపు అని అన్నారు. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చెప్పినట్లు తాను కూడా ప్లాట్లు అమ్మానని, భూములు అమ్మానని, అపార్ట్మెంట్లు నిర్మించి అమ్మానని తెలిపారు. దేవినేని ఏం వ్యాపారం చేశారో చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అసలు దేవినేని కుటుంబం నందిగామ, మైలవరం నియోజకవర్గానికి చెందిన వారు కాదని, గన్నవరం నియోజకవర్గానికి చెందిన దేవినేని ఫ్యామిలీ కంచికచర్లలో కూల్డ్రింక్స్ పెట్టుకుని బతికారని అన్నారు. అలాంటి దేవినేని ఉమా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎలా పోటీ చేశారని వసంత కృష్ణప్రసాద్ ప్రశ్నించారు.
మంత్రి మల్లారెడ్డి లాగా పూలు అమ్మావా? పాలు అమ్మావా? చెప్పాలన్నారు. ఇసుక, మట్టిని అమ్ముకోవడం తప్పం.. దేవినేని ఏం బిజినెస్ చేశారనో చెప్పాలన్నారు. దేవినేని ఉమా వల్లే కృష్ణా జిల్లాలో టీడీపీ కొట్టుకుపోయిందని అన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇతర టీడీపీ నేతలు.. వైసీపీలోకి రావడానికి ప్రధాన కారణం ఉమానే అని కృష్ణప్రసాద్ ఆరోపించారు. ఉమా ఎక్కడికి వెళ్తే అక్కడ టీడీపీకి 500 ఓట్లు తగ్గుతాయని సెటైర్ వేశారు. నందిగామలో కనుక ఉమ ప్రచారం చేస్తే అక్కడ రెండోసారి కూడా మొండితోక జగన్మోహన్రావే గెలుస్తారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జోస్యం చెప్పారు.