Thu Mar 19 2026 01:07:23 GMT+0530 (India Standard Time)
భానుడి భగభగలు.. 46 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలు
శనివారం ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువైనట్లు..

ఏపీలో కొద్దిరోజులుగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. బయటికి వెళ్లాలంటేనే భయపడేలా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేడిగాలులు, ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొద్దిరోజులుగా ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత పెరుగుతోంది. అధిక వేడి కారణంగా నగరాల్లోని రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. మరో రెండు రోజులు రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
నేడు 135 మండలాల్లో, సోమవారం 276 మండలాల్లో వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. శనివారం 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 143 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు తెలిపింది. అధిక వేడి, వడగాలుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లేటపుడు కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించింది. తరచూ మంచినీరు, మజ్జిగ, నిమ్మరసం, పళ్లరసాలను తీసుకుంటూ ఉండాలని తెలిపింది.
Next Story

