Mon May 06 2024 18:43:49 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
ఎన్నోరోజులుగా మండుటెండలతో విసిగి వేసారుతున్న ప్రజలకు నైరుతి వర్షాలు ఉపశమనాన్నిచ్చాయి. వానమ్మ రాకతో రైతులు..
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. నిన్నటికి ఏపీ మొత్తం రుతుపవనాలు విస్తరించగా.. రాష్ట్రమంతా చల్లబడింది. ఎన్నోరోజులుగా మండుటెండలతో విసిగి వేసారుతున్న ప్రజలకు నైరుతి వర్షాలు ఉపశమనాన్నిచ్చాయి. వానమ్మ రాకతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రమంతా మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడా జల్లులు కురుస్తున్నాయి. నైరుతు రుతుపవనాల ప్రభావంతో నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
మన్యం, అనకాపల్లి, అల్లూరి, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
నైరుతి ప్రభావంతో నేడు, రేపు.. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Next Story