Tue Mar 24 2026 07:52:22 GMT+0530 (India Standard Time)
తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు.. ఈ జిల్లాలకు భారీ వర్షం
తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి

తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి. సోమవారం చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం కూడా కొనసాగింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.
ఏపీకి వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. దీని ప్రభావం వచ్చే 48 గంటల వరకు వరకూ ఉండొచ్చు. వచ్చే 24 గంటల వ్యవధిలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య రాయచోటి, కడప, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బాపట్ల, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షం పడుతుంది.
తెలంగాణ లోని మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు.
Next Story

