ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు ప్రమాణం స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో నలుగురు అదనపు న్యాయ మూర్తులు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో నలుగురు అదనపు న్యాయ మూర్తులు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టులో ఇప్పటి వరకూ అదనపు న్యాయమూర్తులుగా పని చేస్తున్న జస్టిస్ హరినాధ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ (కిరణ్మయి కనపర్తి), జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్ లను న్యాయమూర్తులుగా నియమిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా బుధవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొదటి కోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆ నలుగురు అదనపు న్యాయమూర్తులచే న్యాయమూర్తులుగా ప్రమాణం స్వీకారం చేయించారు.
హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ద్వారకానాధ్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అధారిటీ, ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

