Thu Mar 27 2025 03:41:06 GMT+0000 (Coordinated Universal Time)
Undavalli : ఉండవల్లి హితోక్తులు పవన్ తప్ప ఎవరూ వినరనేనా?
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ సన్యాసం చేశారు

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ సన్యాసం చేశారు. 2014 లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే ఆయన మాత్రం రాజకీయంగా దూరమయినా రాజకీయ సూచనలు చేయడం మాత్రం ఆపుకోలేకపోతున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తరచూ మీడియా సమావేశాల్లో పాల్గొనేవారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు రాష్ట్ర విభజన హామీలు, మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఇలా అనేక అంశాలపై మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడేవారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పెద్దగా మాట్లాడటం లేదు. అధికారంలోకి వచ్చి తక్కువ రోజులే కావడంతో పెద్దగా స్పందించడం లేదన్నది ఆయన సన్నిహితుల వాదన.
వైఎస్ హయాంలో వెలిగి...
2004 నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నంత వరకూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకవెలుగు వెలిగారు. రెండుసార్లు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. వైఎస్ ఆయన సలహాలు స్వీకరించేవారు. వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు కూడా ఉండవల్లితో చర్చించి ముఖ్యమైన నిర్ణయాలను వైఎస్ కు చేరవేసేవారు. ఉండవల్లి అరుణ్ కుమార్ సలహాలు తీసుకుంటున్నారంటే అందుకు కారణం ఆయన న్యాయవాది కూడా అవ్వడం కారణం. జక్కంపూడి రామ్మోహన్ రావు సాన్నిహిత్యంతో రాజకీయ రంగంలోకి కాలుమోపిన ఉండవల్లి అరుణ్ కుమార్ తర్వాత కాంగ్రెస్ లో కీలకంగా మారారు. అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్
సూచనలు, సలహాలు తీసుకునే పరిస్థితి ఎవరూ లేరు.
జగన్ పట్టించుకోరు...
వైఎస్ తనయుడు వైఎస్ జగన్ కూడా ఆయనను సంప్రదించలేదు. జగన్ మైండ్ సెట్ వేరు. ఇక చంద్రబాబుకు ఉండవల్లి అరుణ్ కుమార్ కు మధ్య వైరుధ్యాలున్నాయి. అందుకే ఆయన ఈ మధ్య కాలంలో పవన్ కల్యాణ్ ను ప్రశంసించడం మొదలు పెట్టారంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు పవన్ కల్యాణ్ ఆశాజ్యోతి అంటూ కీర్తించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతల్లో పవన్ కల్యాణ్ చాలా డిఫరెంట్ నాయకుడని ఉండవల్లి అన్నారంటే దువ్వుతున్నట్లే కనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రాజకీయాల్లో మనలేమన్న విషయం పవన్ కల్యాణ్ కు తెలుసునని, కానీ, పవన్ కల్యాణ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడి అందరినీ మెప్పిస్తున్నారని ఉండవల్లి అన్నారంటే అందులో లోతైన అర్థముందని చెబుతున్నారు.
బీజేపీ అంటే...
ఉండవల్లి అరుణ్ కుమార్ కు బీజేపీ అంటే పడదు. బీజేపీ పొత్తుతో పవన్ ఉన్నారు. అయినా సనాతన ధర్మం అంటూ కాషాయవస్త్రాలు నిరంతరం ధరించే పవన్ కల్యాణ్ ను ప్రశంసిస్తున్నారంటే ఏదో పరమార్థం ఉండి ఉంటుందన్నది అనుకోక తప్పదు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాల్లోకి తాను రానని చెబుతున్నారు. అంత అవసరం కూడా తనకు లేదంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఉండవల్లి మాట్లాడుతుంటారని చెబుతున్నారు. వినే నేత పవన్ కల్యాణ్ ఒక్కడే కావడంతో ఆయనతో తన మనసులో మాట చెప్పుకోవడానికే ఉండవల్లి ఈ రకమైన కామెంట్స్ చేసినట్లు అర్థమవుతుందన్నారు. మొత్తం మీద పవన్ అయినా తన హితోక్తులు వినకబోతారా? అన్న ఆశతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతుంది.
Next Story