Sun Mar 08 2026 02:58:20 GMT+0530 (India Standard Time)
నారాయణకు బెయిల్ మంజూరు
నారాయణపై పోలీసుల అభియోగాన్ని మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పదవికి నారాయణ..

ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను నిన్న ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి.. చిత్తూరుకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు బెయిల్ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో మేజిస్ట్రేట్ సులోచనారాణి నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నారాయణను హైదరాబాద్లో అరెస్టు చేసి, మంగళవారం రాత్రి చిత్తూరుకు తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
నారాయణపై పోలీసుల అభియోగాన్ని మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరపున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. రూ. లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థలతో నారాయణకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను న్యాయమూర్తికి అందజేసినట్లు నారాయణ తరపు న్యాయవాది తెలిపారు. నారాయణపై మోపిన ఆరోపణలను రుజువు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని, ఆ ఆరోపణల్లో నిజంలేదని నమ్మిన జడ్జి బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నెల 18లోగా రూ. లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారని వెల్లడించారు.
Next Story

