Wed May 21 2025 01:37:04 GMT+0000 (Coordinated Universal Time)
Avanthi Srinivas : క్రాస్ రోడ్స్ లో అవంతి.. ఎటు చూసినా బాబాయ్ కి ఇబ్బందులేనా?
వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుతం రాజకీయంగా ఖాళీగానే ఉన్నారు

వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుతం రాజకీయంగా ఖాళీగానే ఉన్నారు. ఆయన తన విద్యాసంస్థలను చూసుకోవడానికే పరిమితయ్యారు. అయితే ఆయన వైసీపీకి రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా ఏ పార్టీలో చేర్చుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. కానీ అవంతి ట్రయల్స్ మాత్రం ఆపడం లేదు. చివరకు కార్పొరేటర్ గా ఉన్న తన కుమార్తె ను కూడా ఇటీవల మేయర్ పై అవిశ్వాసం తీర్మానం సందర్భంగా రాజీనామా చేయించారు. అయినా సరే అవంతి శ్రీనివాస్ ను మాత్రం ఎవరూ నమ్మడం లేదు. ఆయన మళ్లీ తమ పార్టీలోకి వస్తే రాజకీయంగా ఇబ్బందులే తప్ప అనవసరమన్న అభిప్రాయానికి వచ్చినట్లుంది.
వైసీపీకి రాజీనామా చేసి...
వైసీపీకి ఎందుకు రాజీనామా చేశారని అడిగితే తనకు ప్రాధాన్యత వైసీపీ లో లభించలేదని అవంతి శ్రీనివాస్ చెప్పారు. అయితే ఆయన జీవితంలో తొలిసారి మంత్రి అయింది వైసీపీ ప్రభుత్వంలోనే అన్న సంగతి మరచిపోయారు. పార్టీని వీడాలనుకుని ఫిక్స్ అయినప్పుడు ఏదో ఒక ఆరోపణ చేయడం తప్పించి గతంలో రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఏ పార్టీ అయినా ఇంత ప్రయారిటీ అవంతి శ్రీనివాస్ కు ఇచ్చిందా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఆయన చేసిన ఆరోపణలకు వాల్యూ లేకుండా పోయిందని, ఆయన ఎటు గాలి ఉంటే అటు.. ఎక్కడ అధికారం ఉంటే అటువైపు తిరిగే ప్రొద్దతిరుగుడు పువ్వులా ఉన్నారంటూ ఆయనపై తీవ్రమైన విమర్శలు వినపడుతున్నాయి.
జనసేనలో చేరాలన్నా...
వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరేందుకు ప్రయత్నించారని సమాచారం. అయితే అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలిసింది. అవంతి శ్రీనివాస్ చేరికకు విశాఖ జనసేన నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా అభ్యంతరం తెలిపారు. దీంతో ఆయన చేరికకు రెడ్ సిగ్నల్ పడటంతో ఇక అవంతి శ్రీనివాస్ ఖాళీగానే కూర్చున్నారు. సమయం వచ్చినప్పుడు వారే పిలుస్తారులే అన్న ధీమాతో ఉన్నారు. క్యాస్ట్, క్యాష్ వంటి క్వాలిఫికేషన్లు పుష్కలంగా ఉన్న తనను ఏ పార్టీ అయినా తీసుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాకపోయినా మళ్లీ పార్లమెంటు సభ్యుడిగానైనా పోటీ చేసే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు.
క్యాడర్ మాత్రం...
రెండున్నరేళ్లు మంత్రి పదవిలో ఉన్న అవంతి శ్రీనివాస్ టీడీపీపైనా, జనసేన పైన చేసిన కామెంట్స్ ను ఇప్పుడు రీపోస్ట్ చేస్తున్నారు ఆ పార్టీ అభిమానులు. ఇటువంటి నేతలను చేర్చుకోవద్దంటూ సోషల్ మీడియాలో కూడా నేతలకు సందేశాలను పంపుతున్నారు. అంతే కాదు రేపు మళ్లీ అధికారం పోతే అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్లు ఉండరని, అందుకే వారిని దరి చేరనివ్వవద్దని కోరుతున్నారు. కానీ అవంతి శ్రీనివాస్ మాత్రం తాను త్వరలోనే జనసేనలో చేరతానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. 2014 ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీలోనూ ఆయన 2009 లో ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత వైసీపీలో చేరి రాజీనామా చేసి ఖాళీగానే ఉన్నారు. మరి అవంతిని ఎవరు చేర్చుకుంటారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.
Next Story