Sun Mar 15 2026 17:02:59 GMT+0530 (India Standard Time)
పంటపొలాలపై ఏనుగుల గుంపు దాడి.. వందల ఎకరాల్లో నష్టం
చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం సంగసముద్రంలో జరిగిందీ ఘటన. ఏనుగుల దాడితో.. కొబ్బరిచెట్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అలాగే..

చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు పెరిగిపోతున్నాయి. ఏనుగుల దాడి గురించి ఎన్నిసార్లు పై అధికారులకు ఫిర్యాదు చేసినా.. తగు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఏనుగుల గుంపు పంటపొలాలపై దాడులు చేశాయి. ఆదివారం ఉదయం గుంపులుగా వచ్చిన ఏనుగులు పంటపొలాలను నాశనం చేశాయి. కొబ్బరి చెట్లను నేలమట్టం చేశాయి. ఈ దాడిలో వందలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం సంగసముద్రంలో జరిగిందీ ఘటన.
ఏనుగుల దాడితో.. కొబ్బరిచెట్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అలాగే టమోటా. బీన్స్ పంటలను చిత్తు చిత్తుగా తొక్కిపడేశాయి. చేతికి అందివచ్చిన పంటలను ఏనుగుల గుంపు నాశనం చేయడంతో ఆ ప్రాంత రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏనుగుల దాడి నుంచి తమ పంటపొలాలకు తగిన రక్షణ కల్పించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పొలాల పక్కనే ఉన్న చెరువులో పడుకోవడం కోసం వచ్చే ఏనుగులు.. పంటలన్నింటినీ నాశనం చేస్తున్నాయని వాపోయారు. వెంటనే ఏనుగుల గుంపును అడవిలోకి తరిమివేయాలని వేడుకుంటున్నారు రైతన్నలు.
Next Story

