Sat Mar 07 2026 19:36:45 GMT+0530 (India Standard Time)
విషాదం.. విజయవాడలో పేలిన ఎలక్ట్రిక్ బైక్, భర్త మృతి
రాత్రి బైక్ బ్యాటరీకి బెడ్రూమ్ లో ఛార్జింగ్ పెట్టి కుటుంబం మొత్తం నిద్రపోయింది. తెల్లవారుజామున పెద్దశబ్దంతో ఆ బ్యాటరీ పేలడంతో..

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బైకులు వరుసగా పేలుతున్నాయి. ఇటీవల తెలంగాణలో ఎలక్ట్రిక్ బైక్ పేలి ఓ వ్యక్తి గాయాలపాలైన విషయం తెలిసిందే. తాజాగా ఏపీలోని విజయవాడలో ఎలక్ట్రిక్ బైక్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. నిన్న కొన్న బైక్ ఈ రోజు పేలి.. వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని సూర్యారావుపేటలోని గులాబీపేటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి నిన్ననే ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశాడు.
రాత్రి బైక్ బ్యాటరీకి బెడ్రూమ్ లో ఛార్జింగ్ పెట్టి కుటుంబం మొత్తం నిద్రపోయింది. తెల్లవారుజామున పెద్దశబ్దంతో ఆ బ్యాటరీ పేలడంతో.. మంటలు ఇల్లంతా వ్యాపించాయి. బ్యాటరీ పేలడంతో శివకుమార్, అతని భార్య, పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. పెద్ద పెద్ద కేకలు వేయడంతో.. మంటల్లో ఇరుక్కున్న వారి కుటుంబాన్ని ఇరుగుపొరుగు వారు వచ్చి బయటకుతీశారు. అప్పటికే శివకుమార్, అతని భార్య తీవ్రగాయాల పాలయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో శివకుమార్ మరణించాడు. అతని భార్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పిల్లలకు కూడా గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story

