Sun May 05 2024 20:20:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు శ్రీమహాలక్ష్మీ రూపంలో దుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై నేడు దసరా శరన్నవరాత్రులు నాలుగోరోజుకు చేరుకున్నాయి. శ్రీమహాలక్షిదేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తుంది
ఇంద్రకీలాద్రిపై నేడు దసరా శరన్నవరాత్రులు నాలుగోరోజుకు చేరుకున్నాయి. నాలుగో రోజు శ్రీమహాలక్షిదేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో ఈరోజు తెల్లవారు జామునుంచే బారులు తీరారు. జగజ్జనని అయిన మహాలక్ష్మి రూపంలో ఉన్న దుర్గామాతను దర్శించుకుంటే సకల సౌభగ్యాలు సమకూరుతాయని నమ్ముతారు. అందుకే భక్తులు అధిక సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తుండటంతో ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది.
పోటెత్తిన భక్తులు...
నేడు మహాలక్ష్మీ అవతారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతానాలను ప్రసాదిస్తుందన్న నమ్మకం భక్తుల్లో ఉంది. ఎరుపు రంగు దుస్తులతో ఈరోజు దర్శనమిస్తుంది. ఈరోజు దుర్గమ్మకు దద్దోజనం లేదా పరమాన్నం నైవేద్యంగా పెడతారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో బయట నుంచే క్యూ లైన్లు నిండిపోయాయి. సత్వరం అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎక్కువ సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story