Sat Dec 13 2025 04:50:59 GMT+0000 (Coordinated Universal Time)
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారయ్యాయి.

గోదావరి పుష్కరాల తేదీలు ఖరారయ్యాయి. 2027 జూన్ 26వ తేదీ నుంచి జులై 7వ తేదీ వరకూ గోదావరి పుష్కరాలు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పుష్కరాలపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదలయ్యాయి. తేదీల నిర్ణయానికి తిరుమల జ్యోతిష్య సిధ్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పుష్కరాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశముండటంతో అందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేయాలని నిర్ణయించింది.
పన్నెండు రోజుల పాటు...
గోదావరి పుష్కరాలు మొత్తం పన్నెండు రోజుల పాటు జరగనున్నాయి. 2027 జూన్ ఇరవై ఆరో తేదీన పుష్కరప్రవేశం జరగనుంది. జులై 7వ తేదీన పుష్కర సమాప్తి ఉంటుందని తెలిపింది. పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు అన్ని శాఖల సమన్వయంతో కలసి పనిచేయడానికి త్వరలోనే ఒక కమిటీని కూడా ప్రభుత్వం నియమించనుంది. ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాట్లను ఎక్కువ స్థాయిలో చేయాలని ప్రభుత్వం ఇంతకు ముందే నిర్ణయించింది.
Next Story

