Fri Dec 05 2025 14:59:28 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎంతో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమల వీధులన్నీ భక్తులతో కిక్కిరిసి పోయి ఉన్నాయి. ఎక్కడ చూసినా గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. వరస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుని ఏడుకొండల వాడిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. తలనీలాలను సమర్పించే చోట నుంచి లడ్డూ కేంద్రాల నుంచి, అన్న ప్రసాదం కౌంటర్ల వరకూ భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది.
వాతావరణం చల్లబడటంతో...
వేసవి సెలవులు పూర్తి కావస్తుండటంతో పాటు పరీక్ష ఫలితాలు వెల్లడవ్వడం, ఎండలు తగ్గి చల్లటి వాతావరణం రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్లు పొడవుగా ఉండటంతో భక్తులకు అవసరమైన మజ్జిగ, మంచినీరు, అన్నప్రసాదాలను అక్కడికే పంపిణీ చేస్తున్నారు. సామాన్య భక్తులకు సులువుగా దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ అధికారులు తెలిపారు.
బయట వరకూ క్యూ లైన్...
ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం నేడు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 87,347 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 39,490 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.13 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story

