Wed May 21 2025 02:22:49 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమల నేడు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. సులవుగా దర్శనం
తిరుమలలో రద్దీ కొద్దిగా తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు

తిరుమలలో రద్దీ కొద్దిగా తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. నిన్నటి వరకూ కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తులు బయట వరకూ క్యూ లైన్ లలో వేచి ఉండేవారు. కానీ నేడు కంపార్ట్ మెంట్లలోనే వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది. వేసవిలో తిరుమలకు రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్ల వద్దకే మొబైల్ అన్న ప్రసాదాలను తెస్తూ వారికి అందిస్తూ మంచినీటిని, మజ్జిగను కూడా అందచేస్తున్నారు.
నేడు ఆన్ లైన్ లో...
నేడు తిరుమలలో ఆన్ లైన్ దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు. ఆర్జిత సేవా టిక్కెట్లను నేటి ఉదయం పది గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు. జులై నెలకు సంబంధించిన టిక్కెట్లు నేడు విడుదల కానుండటంతో హాట్ కేకుల్లా అమ్ముడు పోతాయి. జులై నెలకు సంబంధించి ఇప్పటికే కొన్ని సేవా టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒక కంపార్ట్ మెంట్ లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,937 భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,157 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.79 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story