Sun Mar 15 2026 11:57:12 GMT+0530 (India Standard Time)
తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన సీఎం జగన్
భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల కోలాహలం, కళకళలాడే పచ్చనిపైర్లు..

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలను అంబరాన్నంటేలా జరుపుకునేందుకు ప్రజలు తమ సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. రేపటి నుండి నాలుగురోజుల సంక్రాంతి సంబరాలు మొదలుకానున్నాయి. ఈ సందర్భంగా.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పల్లెల పండుగ, రైతుల పండుగ, మన అక్కచెల్లెమ్మల పండుగ.. మొత్తంగా మన సంస్కృతిని, సంప్రదాయాలను చాటిచెప్పే అచ్చ తెలుగు పండుగ అని అభివర్ణించారు.
భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల కోలాహలం, కళకళలాడే పచ్చనిపైర్లు గ్రామాలకు సంక్రాంతి శోభను తీసుకువస్తాయని పేర్కొన్నారు. అలాగే.. ఈ మకర సంక్రాంతి రాష్ట్ర ప్రజల జీవితాల్లో అభివృద్ధితో పాటు మార్పును తీసుకురావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సంక్రాంతి తెచ్చే సంబరాలతో.. తెలుగు లోగిళ్లలో.. ప్రతి ఇంటిలో ఆనందాల సిరులు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు.
Next Story

