Sat May 18 2024 13:04:12 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : మా కుటుంబాన్ని చీల్చే కుట్ర : జగన్ సంచలన కామెంట్స్
కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో చెత్త రాజకీయం చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో చెత్త రాజకీయం చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తిరుపతిలో జరుగుతున్న ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్, బీజేపీలకు బలం లేదన్నారు. ఇష్యూ బేస్డ్ మద్దతు బీజేపీకి ఇస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తమదే గెలుపు అన్న జగన్ ఇచ్చిన హామీలను 98 శాతం మలు చేశామని తెలిపారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఆయనను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారని, పోలీసులు సాక్షాలను కోర్టుకు అందించారు కాబట్టే 52 రోజులు జైలులో ఉన్నారన్నారు. ఎన్నికల ముందు ప్రతిపక్షనేతను ఎవరైనా జైలులో పెడతారా? అనిప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ అయ్యారన్నారు.
కాంగ్రెస్ ది చెత్త రాజకీయం....
తమ కుటుంబాన్ని కాంగ్రెస్ విభజించి పాలించాలన్న కుట్ర చేస్తుందని జగన్ మండి పడ్డారు. అయినా తమకు ప్రజలు మద్దతు ఉందని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరకు ప్రజలను తమ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందన్నారు. తనకు ప్రజల అండ పుష్కలంగా ఉందన్న జగన్ ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పరిస్థితిని బట్టి అప్పటి తమ నిర్ణయం ఉంటుందన్నారు. ఏపీలో జాతీయ పార్టీలకు స్థానం లేదన్న జగన్ అభ్యర్థుల మార్పుల్లో తన సర్వేలు తనకు ఉన్నాయని తెలిపారు. సామాజిక కోణంలోనూ అభ్యర్థుల మార్పు జరిగిందన్నారు. ఏపీలో జాతీయ పార్టీలకు స్థానం లేదని ఆయన అన్నారు. గతంలో మా బాబాయిని తనపై పోటీకి దింపారని, ఇప్పుడు తన చెల్లెలును తనకు ప్రత్యర్థిగా నిలిపారన్నారు.
Next Story