Tue Mar 24 2026 19:46:32 GMT+0530 (India Standard Time)
Chandrababu : రైతులకు చంద్రబాబు భరోసా
రైతులు బలవన్మరణానికి పాల్పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

రైతులు బలవన్మరణానికి పాల్పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని అకాల, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులు ఇద్దరు బలవన్మరణం ప్రయత్నం చేయడంపైవ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అకాల, వడగండ్ల వానతో పంట నష్టపోయి ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు రైతుల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని, ప్రాణాపాయం తప్పిందని...అధికారులు వివరించారు.
ఎవరూ ఆందోళన చెందవద్దంటూ...
మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వడగళ్ల వాన కారణంగా కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లో 40 గ్రామాల్లో పంటనష్ట జరిగిందని అధికారులు వివరించారు. మొత్తం 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు. అకాల వర్షాలు, వడగండ్ల వానవల్ల జరిగిన పంటనష్టం వివరాలను క్షేత్రస్థాయి పర్యటన ద్వారా పరిశీలించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వారికి ప్రభుత్వ పరంగా సాయం అధించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని...రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
Next Story

