Thu Mar 19 2026 03:01:10 GMT+0530 (India Standard Time)
సిక్కోలు వాసులకు గుడ్ న్యూస్
శ్రీకాకుళం జిల్లా వాసులకు త్వరలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది

శ్రీకాకుళం జిల్లా వాసులకు త్వరలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. సిక్కోలు జిల్లాలో మూలాపేటలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్ ద్వారా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు కొత్త విమానాశ్రయాలు నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. అందులో ఒకటి శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట ఒకటిగా ఆయన చెప్పుకొచ్చారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటంతో ఈ ప్రతిపాదన త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మూలాపేటలో...
సిక్కోలు జిల్లాలో రాష్ట్రానికి ఆవలి వైపున ఉండటంతో అక్కడకు వెళ్లాలంటే రైలు, రోడ్డు మార్గాలు మాత్రమే ఇప్పటి వరకూ ఉన్నాయి. విశాఖపట్నం వరకూ విమానంలో వెళ్లి అక్కడి నుంచి తిరిగి రోడ్డు, రైలు మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఇకపై సిక్కోలు వాసులు నేరుగా తమ ప్రాంతానికి చేరుకునేందుకు వీలుగా సంతబొమ్మాళి మండలం మూలాపేటలో ఎయిర్ పోర్టు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన తెలపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మూలపేట పోర్టుకు దగ్గరలో ఈ విమానాశ్రయం నిర్మిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు కూడా అంచనాలు వేస్తున్నారు.
Next Story

