Wed Jan 28 2026 10:45:08 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నేతలకు ఉగ్రవాద లింకులు.. బీజేపీ నేత సంచలన కామెంట్స్
బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.వైసీపీకి చెందిన కొందరు నేతలు పీఎఫ్ఐకి అండగా ఉన్నారని ఆరోపించారు.

బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు పీఎఫ్ఐకి అండగా ఉన్నారని ఆయన ఆరోపణలు చేశారు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐలను వైసీపీ తన మిత్రపక్షాలుగా చూస్తుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు ఎక్కువయ్యాయని అన్నారు. ఈ రెండు సంస్థల పట్ల తెలుగు రాష్ట్రాలు నిర్లక్ష్యం ధోరణిని అవలంబిస్తున్నాయని ఆయన అన్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు పీఎఫ్ఐ, ఎస్డీపీఐలకు షెల్టర్ జోన్లుగా మారాయని విమర్శించారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, హఫీజ్ ఖాన్ లు ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్నారని విష్ణువర్థన్ రెడ్డి సీరియస్ ఆరోపణలు చేశారు.
వారికి సహకరిస్తూ....
రాయచోటి, ఆత్మకూరు పోలీస్ స్టేషన్లను తగుల బెట్టిన వారిని వీరు కాపాడుతున్నారన్ని ఆరోపించారు. వారిపై నమోదయిన కేసులను ఈ ప్రభుత్వం రద్దుచేస్తుందా? అని ప్రశ్నించారు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ప్రతినిధులతో మాజీ హోంమంత్రి సుచరిత ఎందుకు చర్చలు జరిపారని ఆయన ప్రశ్నించారు. పేర్లు మార్చాలనుకుంటే గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్ కు ఆ పేరు మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని సూచించారు. వైసీపీ ట్రాప్ లో టీడీపీ పడిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story

