Sun Apr 28 2024 06:40:52 GMT+0000 (Coordinated Universal Time)
దస్తగిరికి సీటు కన్ఫర్మ్ చేసేసిన ఆ పార్టీ.. సీఎం జగన్ పై పోటీ
పులివెందుల నుండి పోటీ చేయనున్న దస్తగిరి
వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కీలక నిందితుడు ఉంటూ అఫ్రూవర్ గా మారిన దస్తగిరి రానున్న ఎన్నికల్లో పులివెందుల నుంచి సీఎం జగన్ పై పోటీ చేయనున్నారు. జైభీమ్ పార్టీలో చేరిన ఆయనకు పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ పులివెందుల సీటు ఖరారు చేశారు. ఈ మేరకు జైభీమ్ పార్టీలో చేరిన ఆయనకు పార్టీ అధ్యక్షుడు కండువా కప్పి సాధరంగా స్వాగతం పలికారు. వివేకా హత్య కేసులో తాను చేసిన తప్పును సీబీఐ అధికారుల ముందు ఒప్పుకుని అఫ్రూవర్ గా మారారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వారి అనుచరులపై సంచలన ఆరోపణలు చేశారు. బెయిల్ పై బయటకు వచ్చిన దస్తగిరి పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచారు. ప్రత్యర్థుల నుంచి ప్రాణహానీ ఉండటంతో సీబీఐ సూచన మేరకు దస్తగిరికి ప్రత్యేకంగా గన్ మెన్లతో రక్షణ కల్పించారు. కడప జిల్లా జైలులో ఉన్న దస్తగిరి ఇటీవలే విడుదలయ్యారు.
ఇటీవల నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన దస్తగిరి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్పై పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తనకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. పులివెందులలో అరెస్ట్ అయిన వ్యవహారానికి సంబంధించిన అన్ని వివరాలను సీబీఐకు ఇచ్చానన్న దస్తగిరి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.
Next Story