Sun Mar 08 2026 02:55:54 GMT+0530 (India Standard Time)
సాహితీ ఫార్మా మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి అమర్నాథ్
ప్రమాదంలో గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మరో ఐదుగురి పరిస్థితి..

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ లోని సాహితీ ఫార్మా కంపెనీలో శుక్రవారం మధ్యాహ్నం రియాక్టర్లు పేలి.. అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో కంపెనీలో 35 మంది కార్మికులు ఉండగా.. మంటలను చూసి కార్మికులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మృతులు పైలా సత్తిబాబు, ఉప్పాడ తిరుపతి గా గుర్తించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. మరోవైపు ఫార్మా కంపెనీలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదని సమాచారం. ఎనిమిది ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. చుట్టుపక్కల ఫ్యాక్టరీలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

