Wed Jan 21 2026 03:52:55 GMT+0000 (Coordinated Universal Time)
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించిన ఆయన.. అక్కడే ఈ పథకాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించిన ఆయన.. అక్కడే ఈ పథకాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను ఇన్నాళ్లకు నిజం చేస్తున్నామన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా 50 లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందాన్నిస్తోందని చెప్పారు. నిరుపేదలు కూడా ఓ ఇంటికి యజమాని కావాలన్న ముఖ్య ఉద్దేశ్యంతోనే నామమాత్రపు చెల్లింపులతో వారికి గృహ హక్కును కల్పిస్తున్నామని వివరించారు.
పేదల అభివృద్ధిని చూడలేక..
సొంత ఇల్లు ఉంటే.. పేదల ఆస్తి విలువ కూడా పెరుగుతుందన్నారు సీఎం జగన్. ఆ ఇంటిని అమ్ముకునే హక్కు లబ్ధిదారుడికి ఉంటుందని.. అందుకోసం ఇళ్ల క్రయ విక్రయాల లింకు డాక్యుమెంట్లేవీ అవసరం ఉండదన్నారు. ప్రజల కోసం తాము ఇంత కష్టపడుతుంటే.. కొందరూ చూసి తట్టుకోలేకపోతున్నారంటూ.. కొందరు విపక్ష నేతలపై జగన్ పరోక్షంగా కామెంట్లు చేశారు. "రిజిస్ట్రేషన్ లేని పేదల ఇళ్లను మార్కెట్ ధరలకే కొంటారా? అని చంద్రబాబును, రాధాకృష్ణను, రామోజీరావును నిలదీయండి" అంటూ ప్రజలకు సూచించారు. "వీళ్ల ఆస్తులు రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి... పేదల ఆస్తులకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదా?" అని సీఎం జగన్ ప్రశ్నించారు.పేదల జీవితాలు బాగుపడుతుంటే చూసి ఓర్వలేని వారందరికీ పేదలే సమాధానం చెప్పాలన్నారు.
Next Story

