Sat Dec 06 2025 00:08:13 GMT+0000 (Coordinated Universal Time)
వాలంటీర్లే గొప్ప సేవకులు.. సైనికులు
వాలంటీర్ల వ్యవస్థ ద్వారా దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా చేసిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు

వాలంటీర్ల వ్యవస్థ ద్వారా దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా చేసిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. నరసరావుపేటలో వాలంటీర్ల సన్మాన సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. వాలంటీర్ల మహాసైన్యానికి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. 50,850 కోట్లు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు ఇంటికి వెళ్లి లబ్దిదారులకు అందచేశారని జగన్ అన్నారు. 2.60 లక్షల మంది వాలంటీర్లు నిత్యం ప్రజల వద్దనే ఉంటున్నారన్నారు.
సేవాభావంతో....
తూర్పున సూర్యుడు ఉదయించకముందే ఇంటికి వెళ్లి పింఛను మొత్తాన్ని లబ్దిదారులకు చెల్లిస్తున్నారని తెలిపారు. వాలంటీర్లు సేవా భావంతో పనిచేస్తున్న తీరును జగన్ అభినందించారు. ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలను ప్రజల వద్దకు నేరుగా తీసుకెళుతుంది వాలంటీర్ల వ్యవస్థ అని జగన్ అన్నారు. ప్రభుత్వం అమలు చేసే 33 పథకాలను లంచాలకు తావులేకుండా ప్రతి ఇంటికీ చేరవేస్తున్నారని జగన్ అన్నారు.
మూడు కేటగిరిలలో....
ఇంతకు మించి అభివృద్ధి ఏముంటుందని జగన్ ప్రశ్నించారు. గ్రామ, వార్డు, సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్ల వల్లనే ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా పథకాలను అందుకోగలుగుతున్నారని చెప్పారు. వాలంటీర్లు గొప్ప సేవకులు, సైనికులు అని జగన్ కొనియాడారు. వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర వంటి మూడు రంగాల్లో అవార్డులను ప్రదానం చేశారు. కోవిడ్ సమయంలో అందించిన సేవలు అభినందనీయమని చెప్పారు. మొత్తం 20 రోజుల పాటు వాలంటీర్లకు రాష్ట్ర వ్యాప్తంగా సత్కారం జరుగుతుందని జగన్ చెప్పారు.
Next Story

