Wed May 15 2024 05:09:52 GMT+0000 (Coordinated Universal Time)
పెగాసస్ పై హౌస్ కమిటీ.. స్పీకర్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్ స్పైవేర్ అంశంపై హౌస్ కమిటీ వేయాలని నిర్ణయించింది
ఆంధ్రప్రదేశ్ శాసనసభ కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్ స్పైవేర్ అంశంపై హౌస్ కమిటీ వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ప్రశ్నోత్తరాల అనంతరం ఏపీ శాసనసభలో పెగాసస్ అంశంపై చర్చ జరిగింది. టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురి కావడంతో వైసీపీ సభ్యులు ఈ అంశంపై మాట్లాడారు. పెగాసస్ అంశంపై విచారణ జరపాలని అంబటి రాంబాబు, అమరనాధ్ రెడ్డి, బుగ్గనరాజేంద్ర నాధ్ రెడ్డి తదితరులు కోరారు.
సభ్యుల డిమాండ్లతో....
పెగాసస్ స్పైవేర్ ను చంద్రబాబు కొనుగోలు చేసినట్లు తమకు అనుమానాలున్నాయని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అసెంబ్లీలో ఈ విషయాన్ని స్పష్టం చేశారన్నారు. ఖచ్చితమైన సమాచారంతోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని చెప్పారు. వ్యక్తిగత వివరాలను సేకరించే ప్రమాదముందని, సభ్యుల హక్కులను కాపాడేందుకు పెగాసెస్ స్పైవేర్ పై విచారణకు ఆదేశించాలని సభ్యులు కోరారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం దీనిపై విచారణకు హౌస్ కమిటీతో్ చేయించాలని నిర్ణయించారు.
Next Story