Thu Mar 19 2026 07:19:24 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్లో మరో బస్సుకు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్లో మరో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయింది

ఆంధ్రప్రదేశ్లో మరో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయింది. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బాపట్లకు వెళ్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు పల్నాడు జిల్లా రాచుపాలెం మండలంలోని రెడ్డిగూడెం వద్ద అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న సిమెంట్ పైపులపై ఒరిగిపోయింది. ఆ పైపులు అక్కడ జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల కోసం ఉంచినవని అధికారులు తెలిపారు. అయితే, అదృష్టవశాత్తూ బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులందరూ అత్యవసర ద్వారం ద్వారా సురక్షితంగా బయటపడ్డారు.
30 మంది ప్రయాణికులు...
ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రైవేట్ బస్సు యజమానులు, ప్రభుత్వ రవాణా సంస్థలు పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రహదారుల దుస్థితి, జాతీయ రహదారులు బాగా దెబ్బతిన్న పరిస్థితి కూడా ఈ ప్రమాదాలకు కారణమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రయివేటు ట్రావెల్స్ బస్సులే ప్రమాదానికి ఎక్కువగా గురవుతున్నాయి.
Next Story

