Sat May 24 2025 13:06:23 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఒకే రోజు ఇద్దరు కీలక వ్యక్తుల విచారణ
వైసీపీ అధినేత జగన్ హయాంలో జరిగిన అనేక అవకతవకలు ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పీడ్ ను పెంచారు.

వైసీపీ అధినేత జగన్ హయాంలో జరిగిన అనేక అవకతవకలు ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పీడ్ ను పెంచారు. వరగా అరెస్ట్ లు చేస్తూ జగన్ జిల్లా యాత్రలు చేపట్టే ముందే ఝలక్ ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుంది. అందుకోసమే ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలున్న మద్యం స్కామ్ కేసులో ఇప్పటికే స్పెషల్ ఇన్విస్టిగేషన్ పోలీసులు స్పీడ్ ను పెంచారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతో తగిన ఆధారాలను సేకరించారు. దీంతో పాటు రాజ్ కసిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నేడు రాజ్ కసిరెడ్డిని విచారిస్తున్నారు. ఈ కేసులో రాజ్ కసిరెడ్డిని విచారణ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు.
పెద్దయెత్తున నగదు....
మద్యం స్కామ్ కేసులో భారీ ఎత్తున నగదు చేతులు మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ కు పెద్దయెత్తున ముడుపులు అందినట్లు ఆరోపణలను రాజ్ కసిరెడ్డి ద్వారా బయటకు తీసుకు వచ్చే ప్రయత్నంలో నేడు సిట్ అధికారులున్నారు. వేల కోట్ల రూపాయలను మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును ఇతర దేశాలకు తరలించారని ఇప్పటికే నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు కూడా అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఈ నగదు ఎవరి ఖాతాల్లోకి వెళ్లింది? ఎవరి పేరు మీద విదేశాల్లో డిపాజిట్ అయిందన్న వివరాలను నేడు రాజ్ కసిరెడ్డి ద్వారా రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకోసమే నేడు రాజ్ కసిరెడ్డి విచారణ కీలకంగా మారనుంది.
మద్యం పాలసీలో...
ముడుపులు తీసుకునేందుకు వీలుగా నూతన మద్యం విధానాన్ని రూపొందించేందుకు 2019 లో విజయసాయిరెడ్డికి చెందిన హైదరాబాద్, విజయవాడ ఇంట్లో సమావేశాలు కూడా జరిగాయి. ఈ సమావేశంలో రాజంపేట్ మిధున్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు హాజరయ్యారని సాక్షాత్తూ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కుంభకోణంలో రాజకీయ నేతలు, ఇతర అధికారుల ప్రమేయంపై కూడా నేడు రాజ్ కసిరెడ్డి విచారణ చేయనున్నారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతో పాటు నేడు రాజ్ కసిరెడ్డి విచారణలో వెల్లడయిన విషయాలు కూడా బేరీజు వేసుకుని సిట్ అధికారులు ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిస్టలరీల విషయంలో కూడా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి.
పీఎస్ఆర్ కేసులో కూడా...
ఇక తాజాగా మరో కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. ముంబయి నటిని వేధించిన కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకెళుతున్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులు గత ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేసి టీడీపీ ముఖ్యనేతలపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా అరెస్ట్ లకు కూడా కారణమయ్యారన్న ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పీఎస్ఆర్ ఆంజనేయులను కూటమి ప్రభుత్వం రాగానే ఈ కేసులో సస్పెండ్ చేసింది. ఆయనపై నమోదయిన కేసులో ప్రస్తుతం అరెస్ట్ చేసి విచారణ ను సీఐడీ అధికారులు చేయనున్నారు.
Next Story