Thu Dec 18 2025 23:00:24 GMT+0000 (Coordinated Universal Time)
జీవో నెంబరు 1 సస్పెన్షన్ : ఏపీ సర్కార్ కు షాక్
జగన్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. జీవో నెంబరు 1ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

జగన్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. జీవో నెంబరు 1ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ షోలు, రహదారులపై బహిరంగ సభలు పెట్టరాదంటూ ప్రభుత్వం జీవో నెంబరు 1 ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిటీషన్ దాఖలు చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రభుత్వం జీవో విడుదల చేసిందని పిటీషనర్ తరుపున న్యాయవాది వాదించారు.
ఈ నెల 20వ తేదీలోగా...
అయితే దీనిపై అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరుపున వాదనలను వినిపించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉందని తమకు సమాచారం లేదని ఆయన అన్నారు. రోస్టర్ ప్రకారం ఈ పిటీషన్ రావాలని, ప్రభుత్వ విధానాలపై వెకేషన్ బెంచ్ విచారించే అవకాశం లేదని అన్నారు. అయితే ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు ధర్మాసనం జీవో నెంబరు 1ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23వ తేదీ వరకూ జీవోను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఈ నెల 20వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
Next Story

