Fri Dec 05 2025 12:25:06 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : రాజధాని అమరావతికి కొత్త సొబగులు.. గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో గ్యాస్ పైపులైన్లను నిర్మించాలని నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో గ్యాస్ పైపులైన్లను నిర్మించాలని నిర్ణయించింది. ఇది జరిగితే తొలి పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి రికార్డులకు ఎక్కుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వం ముందు ఉంచింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు అంగీకరించడంతో రాజధానిలో గ్యాస్ పైప్ లైన్లను ఏర్పాటు చేయడానికి మార్గం మరింత సుగమం అయింది. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ తరహాలో రాజధాని అమరావతిని పైప్డ్ గ్యాస్ రాజధానిగా తయారు చేయనున్నారు.

మూడేళ్లలో పూర్తి చేయాలన్న...
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పనులను వేగంగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల పనులకు అనుమతి కూడా సీఆర్డీఏ అధికారులకు ఇటీవల ఇచ్చారు. త్వరలోనే పనులకు సంబంధించిన టెండర్లను సీఆర్డీఏ ఆహ్వానించనుంది. ఈ నెలలో టెండర్లను ఖరారు చేసి జనవరి నుంచి రాజధాని అమరావతి పనులను ప్రారంభించాలని ప్రభుత్వం ముహూర్తంగా నిర్ణయించింది. మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనుల్లో కొన్నింటిని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది.
వేగంగా పనులు...
దీంతో పాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ పైప్డ్ లైన్ పనులను కూడా ప్రారంభయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం అంగీకరించడం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పనులు చేపట్టేందుకు ముందుకు రావడంతో ఇక పనులు వేగంగానే జరగనున్నాయి. అమరావతి రాజధానిని విన్నూత్నంగా నిర్మించాలన్న ఉద్దేశ్యంతో ఉన్న చంద్రబాబునాయుడు అన్ని రకాలుగా కొత్త విధానాలను పరిశీలిస్తున్నారు. వీటన్నింటినీ త్వరగా పూర్తి చేయడంతో పాటు రైలు మార్గం కూడా ఏర్పాటయితే ఇక అమరావతికి తిరుగుండదన్న భావన వ్యక్తమవుతుంది. మరోవైపు ఏషియన్ డెవలెప్ మెంట్ బ్యాంకు సయితం రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు చేసేందుకు ముందుకు రావడంతో పనులు వేగిరం ప్రారంభం కానున్నాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

