Wed May 21 2025 05:58:02 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాన్ని మారుస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకోన్నారని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకోన్నారని తెలిసింది. ఇక దేశ రాజకీయాల వైపు చూస్తున్నారా? కేంద్ర మంత్రిగా వెళ్లాలనుకుంటున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు అదే చెబుతున్నాయి. రానున్న కాలంలో ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కలసి పోటీ చేసినప్పటికీ తాను రాష్ట్ర రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉండే కంటే కేంద్రంలో మంత్రి పదవి తీసుకుని దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ ఇటు బీజేపీతో పాటు జనసేనను కూడా బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. అందుకోసమే తన సోదరుడు నాగబాబును ఇక్కడి పార్టీని పర్యవేక్షించేందుకు ఎమ్మెల్సీ చేశారంటున్నారు.
ఎన్నాళ్లున్నాఇంతే...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నాళ్లున్నా ఇక ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. పార్టీ అభిమానులు, కాపు సామాజికవర్గం నుంచి తనను ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ అనుభవం ఉన్న చంద్రబాబు ఉన్నసమయంలో తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టలేరు. అందుకే పవన్ కల్యాణ్ కూడా తరచూ మరో పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెబుతున్నారంటున్నారు. చంద్రబాబు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తాను కేంద్ర మంత్రిగా వెళితే రాష్ట్రానికి కూడా కొంత ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ తన సోదరుడు నాగబాబును మంత్రిని చేస్తే ఆయన పార్టీతో పాటు కూటమి నేతలకు దగ్గరగా ఉండే అవకాశముంటుందని ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి అంటే ఆరోవేలుగా అందరూ అభివర్ణిస్తారు.
ఉపముఖ్యమంత్రి అంటే...
మంత్రికి మించి ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకించి ఎటువంటి అధికారాలుండవు. అదే కేంద్ర మంత్రి అయితే ముఖ్యమంత్రి తో సమానమైన హోదా ఉంటుంది. దీంతో పాటు ప్రొటోకాల్ కూడా ఉంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, తనను అభిమానించడం వల్లనే కొంత ప్రాధాన్యత ఇస్తున్నా ఈ పదవి అంటేనే పవన్ కల్యాణ్ కు మొహం మొత్తిందని అంటున్నారు. ఎన్నాళ్లు చేసినా ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వస్తుంది తప్ప ఎదుగుదల ఉండదని, అదే మోదీ కేబినెట్ లోకి వెళితే కొంత ఇమేజ్ కూడా పెరుగుతుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు కు పోటీ చేయాలన్న ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
మరోసారి బీజేపీ...
మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకమే ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అందుకే పవన్ కల్యాణ్ బీజేపీ లైన్ లోకి వెళ్లారంటున్నారు. సనాతన ధర్మం అంటూ ఆయన నినాదాన్నిచేయడం కూడా ఇందులో భాగమేనని చెబుతున్నారు. మరొకవైపు నరేంద్ర మోదీ కూడా తనంటే మంచి అభిప్రాయం ఉంది. మోదీ గుడ్ లుక్స్ లో ఉన్నారు. ఈ సమయంలో మోదీ కేబినెట్ లో మంత్రిగా చేరితే కొంత వెసులుబాటు దొరుకుతుందని, రాష్ట్ర రాజకీయాలకు అవసరమైతే తర్వాత రావచ్చన్న యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారంటున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది.
Next Story