Thu Mar 19 2026 11:56:05 GMT+0530 (India Standard Time)
నేడు కర్నూలు జిల్లాకు జగన్
సీఎం జగన్ నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ప్రారంభిస్తారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ పంప్ హౌస్ ద్వారా నీటిని పత్తికొండ, డోన్, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలలోని చెరువులను నింపనున్నారు. దీంతో ఈ నియోజకవర్గాల్లోని చెరువులు జలకళను సంతరించుకోనున్నాయి. హంద్రినీవా కాల్వ నుంచి తాగు, సాగునీటిని నేడు జగన్ విడుదల చేయనున్నారు. దాదాపు 10వేలకు పైగా ఎకరాలకు సాగునీరు అందనుంది. అనంతరం నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు.
అరెస్ట్ లు...
ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీడీపీ, వామపక్ష పార్టీ నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఉన్న సీపీఐ నేతలతో పాటు టీడీపీ నేతలను కూడా ముందస్తుగా అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్లను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ఏపీలో నిరంకుశ పాలన సాగుతుందని ఆయన అన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని విమర్శించారు.
Next Story

