Fri Dec 05 2025 20:48:58 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : లోటస్పాండ్కు జగన్... రెండేళ్ల తర్వాత...?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత లోటస్ పాండ్లోని తన ఇంటికి చేరుకోనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత లోటస్ పాండ్లోని తన ఇంటికి చేరుకోనున్నారు. కేసీఆర్ ను పరామర్శించిన తర్వాత అక్కడే భోజనం చేసిన అనంతరం ఆయన లోటస్ పాండ్ కు రానున్నారు. కాసేపు లోటస్ పాండ్లోని తన నివాసంలో ఉన్న అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తాడేపల్లిలోని తన నివాసంలోనే ఎక్కువ ఉంటున్నారు.
సుదీర్ఘకాలం తర్వాత...
హైదరాబాద్ కు వచ్చినా లోటస్ పాండ్ వైపు కన్నెత్తి చూడలేదు. అయితే ఈరోజు జగన్ లోటస్ పాండ్కు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఢిల్లీకి వెళ్లిన సమయంలో వైఎస్ జగన్ లోటస్ పాండ్ కు చేరుకోవడం విశేషం. లోటస్ పాండ్ లో ఉన్న తన తల్లి విజయమ్మ ను జగన్ ను కలసి షర్మిల రాజకీయ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ తరుపున నాయకత్వ బాధ్యతలను స్వీకరించనున్న నేపథ్యంలో తన తల్లి విజయమ్మతో ఆ విషయం చర్చించనున్నారని తెలిసింది.
కేసీఆర్కు పరామర్శ...
విజయవాడ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ కు బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు స్వాగతం పలికారు. ఆయనను నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ కేసీఆర్ తో జగన్ మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఎంపీ మిధున్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం అక్కడ భోంచేసిన తర్వాత లోటస్ పాండ్ కు జగన్ బయలుదేరి వెళతారు.
Next Story

