Wed Feb 04 2026 13:23:31 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖకు జగన్ వరాలు
వైఎస్సార్ వాహనమిత్ర నాలుగో విడత నిధులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు

వైఎస్సార్ వాహనమిత్ర నాలుగో విడత నిధులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన ఆటో డ్రైవర్లతో ఫొటోలు దిగారు. నాలుగో విడత 261 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ వాహనమిత్ర పథకం కింద ఒక్కొక్కరికి నలభై వేలు ఇచ్చామని, మొత్తం వెయ్యికోట్లు ఖర్చు చేశామని జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్ల నుంచి చలాన్ల రూపంలో వందల కోట్ల రూపాయలు గుంజారని జగన్ ఆరోపించారు. తాను పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఈ సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
విశాఖ తూర్పులో...
గోదావరి వరద తీవ్రత ఎక్కువగా ఉందని, అనేక పంటలు దెబ్బతిన్నాయని, వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారని జగన్ అన్నారు. దుష్టచతుష్టయం చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లు వక్రీకరిస్తున్నారన్నారు. వీళ్ల మాదిరి తనకు అన్ని టీవీ ఛానళ్లు, పేపర్లు లేవని చెప్పారు. ఒకటి మాత్రం చెబుతున్నానని, తనకు ఉన్న నిబద్దత, నిజాయితీతో పనిచేస్తానని చెప్పారు. ప్రజల మీద, దేవుడు మీద ఆధారపడతానని జగన్ అన్నారు. కరోనా వచ్చినా పథకాలను వేటినీ ఆపలేదని, పేదలను ఆదుకునే దిశగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని జగన్ అన్నారు. విశాఖ తూర్పు కాలనీలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు.
Next Story
