Thu May 22 2025 06:42:47 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : దావోస్ టూర్ పై చంద్రబాబు ఏమన్నారంటే?
దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు

దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. దావోస్ పర్యటనకు తాను 1995 నుంచి వెళుతున్నానని, అది కొత్తేమీ కాదని చెప్పారు. ప్రపంచంలోని గొప్ప కంపెనీలన్నీ దావోస్ కు వస్తాయని, వారికి మన రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితులు వివరించడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని చంద్రబాబు అన్నారు. ఎన్ని ఎంవోయూలు చేసుకున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని, ఎంవోయూలు ఇక్కడ ముఖ్యం కాదని, భవిష్యత్ ను వివరించడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధిని సాధించడమే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. సాధారణమైన వ్యక్తులను అసాధారణమైన వ్యక్తులగా మార్చడానికి దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందని చంద్రబాబు అన్నారు.
1995లోనూ ఇలాగే...
1995లో తాను ఐటీ కంపెనీ గురించి మాట్లాడినప్పుడు అందరూ ఎద్దేవా చేశారని, 2025 నాటికి అది ఎంత బలంగా ఆవిర్బవించిందో మన కళ్ల ముందే చూశామని చంద్రబాబు అన్నారు. నాడు ఐటీ అయితే నేడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ప్రమోట్ చేశామన్నారు. దావోస్ అంటే కొన్ని అపోహలు ఉన్నాయని, ఎంవోయూలు కుదిరినంత మాత్రాన పెట్టుబడులు వచ్చినట్లు కాదని, కానీ వారు వచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తే అప్పుడు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తాను పదిహేను మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యానని, వారికి రాష్ట్రం పరిస్థితుల గురించి వివరించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏడు నెలల కాలంలో విధ్వంసకరమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని తెలిపారు. రామాయపట్నంలో 96 వేల కోట్ల రూపాయల వ్యయంతో బీపీసీఎల్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పారు.
Next Story