Mon Feb 02 2026 23:10:46 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం.. ఆమోదించే అంశాలివే?
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు మంత్రి వర్గ సమావేశం సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరో నలభై వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్ అవసరాలకు సరిపడా ఈ భూములను రైతుల నుంచి తీసుకోవాలని భావిస్తుంది. దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
సీఆర్డీఏ పనులకు....
దీంతో పాటు సీఆర్డీఏ ఆమోదించిన పనులకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. కొత్త అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణానికి సంబంధించి కేబినెట్ టెండర్లను ఆమోదించనుంది. కొత్తగా సేకరించే భూములకు కూడా రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే విషయంపై చర్చించి ఆమోదించనున్నారు. దీంతో పాటు పారిశ్రామక సంస్థల పెట్టుబడులు, ఉపాధి కల్పనపై కూడా చర్చించనున్నారు. ఐటీ కంపెనీలకు రాజధాని అమరావతిలో నామమాత్రపు ధరలకే భూములు ఇవ్వాలని నిర్ణయించే అవకాశముంది. దీంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story

