Sat Mar 07 2026 19:52:43 GMT+0530 (India Standard Time)
తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు భారీ విరాళం
తిరుమల వేంకటేశ్వర స్వామివారికి ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళాన్ని అందించాడు. 3.5 కోట్ల విలువైన ఆభరణాలను అందించారు

కలియుగ ప్రత్యక్షదైవం.. తిరుమలలోని ఏడుకొండలపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళాన్ని అందించాడు. అరుదైన ఆభరణాలను ఎంతో అందంగా తయారు చేయించారు. స్వామివారికి భక్తి శ్రద్ధలతో చేయించిన బంగారు కటి, వరద హస్తాలను శుక్రవారం వీఐపీ విరామ సమయంలో టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డికి అందించారు అజ్ఞాత దాత.
3.5 కోట్ల విలువైన...
ఆలయంలో ఉన్న మూలవిరాట్ కు అలంకరించేందుకు సులువుగా ఉండేలా ఆ ఆభరణాలను తయారు చేయించారు. 5.5 కిలోల బరువుగల కటి, వరద బంగారు హస్తాలు సుమారు రూ.3.5 కోట్లు విలువ ఉంటాయని టీటీడీ అంచనా వేస్తోంది. ఆ స్వర్ణ కటి, వరద హస్తాలను ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించనున్నారు. కాగా.. స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆభరణాలు చేయించామని, ఈ మాత్రానికే తమకు ప్రచారం అవసరం లేదని కోరడంతో.. టీటీడీ ఆ దాత వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచినట్లు సమాచారం.
Next Story

