Thu Mar 19 2026 05:50:29 GMT+0530 (India Standard Time)
900వ రోజుకు చేరుకున్న రాజధాని ఉద్యమం
రాజధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి 900వ రోజుకు చేరుకుంది

రాజధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి 900వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి సాధన సమితి నాయకులు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నారు. రాజధాని కోసం ఆందోళన చేస్తూ అశువులు బాసిన వారికి నివాళులర్పించడంతో పాటుగా న్యాయదేవత, అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాన్ని నిర్వహించనున్నారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని సమితి నేతలు ఆరోపిస్తున్నారు.
తీర్పు తర్వాత కూడా...
హైకోర్టు తీర్పు తర్వాత కూడా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన ఆలోచనను విరమించుకోకపోవడంతో ఆందోళనను కొనసాగిస్తున్నారు. 2020 జనవరి నెలలో అమరావతి రైతులు రాజధాని కోసం ఆందోళనలు ప్రారంభించారు. న్యాయస్థానాలు తమకు అనుకూలంగా తీర్పు చెప్పినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తమ ఆందోళన కొనసాగుతుందని వారు ప్రకటించారు. 900వ రోజు సందర్భంగా పలువురు పార్టీ నేతలు రైతులకు సంఘీభావం తెలిపే అవకాశముంది.
Next Story

