Fri Mar 29 2024 08:38:24 GMT+0000 (Coordinated Universal Time)
64 ఏళ్ల వయసులో గేట్ లో 140వ ర్యాంకు సాధించిన తెలుగు తేజం
64 ఏళ్ల వయసులో గేట్ పరీక్ష రాసి.. జాతీయ స్థాయిలో 140వ ర్యాంకు సాధించారు ఆయన. జియో గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్..
అనంతపురం : "కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. చదువుకు వయసు అడ్డు కాదు. " అన్న మాటలను అతను నిరూపించాడు. అతని సంకల్పం ముందు వయసు చిన్నబోయింది. 64 ఏళ్ల వయసులో గేట్ పరీక్ష రాసి.. జాతీయ స్థాయిలో 140వ ర్యాంకు సాధించారు ఆయన. జియో గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GIS), రిమోట్ సెన్సింగ్ కోర్సులో చేరేందుకు రెడీ అయ్యారు. అయితే బాంబే ఐఐటీలో చేరాలా? లేదంటే రూర్కీ ఐఐటీలో చేరాలా? అనే విషయంలో కొంత సందిగ్ధంగా ఉన్నారు. ఆయనే సత్యనారాయణ రెడ్డి.
అనంతపురానికి చెందిన సత్యనారాయణ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖలో 39 ఏళ్లు ఇంజనీరుగా పనిచేశారు. డీఈఈగా 2018లో ఉద్యోగ విరమణ పొందిన సత్యనారాయణ.. 2019లో జేఎన్టీయూ సివిల్ భాగంలో ఎంటెక్ లో చేరి 2022లో పూర్తి చేశారు. అనంతరం గేట్ పరీక్ష రాసి జియోమోటిక్స్ ఇంజనీరింగ్ పేపర్ లో 140వ ర్యాంక్ సాధించి.. ఔరా అనిపించుకున్నారు. చదువుకోవాలనే శ్రద్ధ, పట్టుదల ఉన్నవారికి వయసు అడ్డుకాదని చెప్పకనే చెప్పారు. కుటుంబ సభ్యులతో చర్చించి ఏ ఐఐటీలో చేరాలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని సత్యనారాయణ రెడ్డి చెబుతున్నారు.
Next Story