Fri Mar 20 2026 05:31:49 GMT+0530 (India Standard Time)
బెజవాడలో బుక్ ఫెస్టివల్.. రేపే ప్రారంభం
శనివారం సాయంత్రం 6 గంటలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుస్తక ప్రదర్శనను ప్రారంభించనున్నారు. ప్రతిరోజూ

విజయవాడ నగర పుస్తక ప్రియులను అలరించేందుకు 32వ పుస్తక ప్రదర్శన (బుక్ ఫెస్టివల్) ప్రారంభం కానుంది. జనవరి1వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ.. 11 రోజుల పాటు ఈ పుస్తక మహోత్సవం జరుగుతుందని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ సభ్యులు వెల్లడించారు. బందర్ రోడ్ లోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో జరిగే ఈ పుస్తక మహోత్సవంలో 210 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ప్రదర్శనలో దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి..
శనివారం సాయంత్రం 6 గంటలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుస్తక ప్రదర్శనను ప్రారంభించనున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ పుస్తక ప్రదర్శన జరుగుతుంది. అలాగే జనవరి 4వ తేదీన ప్రెస్ క్లబ్ నుంచి బందర్ రోడ్ స్వరాజ్య మైదాన్ వరకూ పుస్తక ప్రియులతో పాదయాత్ర నిర్వహించనున్నారు. జనవరి 11వ తేదీ.. అనగా చివరిరోజున వీడ్కోలు సభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా.. ఈ పుస్తక మహోత్సవానికి వచ్చే ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి రావాలని, శానిటైజర్లను వెంట తెచ్చుకోవాలని బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తెలిపారు. కోవిడ్ నియమ, నిబంధనలకు అనుగుణంగానే ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు.
News Summary - 32nd book exhibition starts in vijayawada PWD Ground on january 1st
Next Story

