Sat Dec 13 2025 22:34:55 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలకు వెళ్లే వారికి అలెర్ట్.. రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమలకు భక్తులు అధికసంఖ్యలో చేరుకోవడంతో టీటీడీ అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలకు భక్తుల రద్దీ ఏ రోజు కూడా తగ్గడం లేదు. స్వామి వారి హుండీ ఆదాయం కూడా ప్రతి రోజూ నాలుగు కోట్ల రూపాయల వరకూ వస్తుంది. లడ్డూల విక్రయాలు కూడా ఎక్కువగా జరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు లడ్డూలు, అన్న ప్రసాదం తయారీ భక్తుల అవసరానికి తగినట్లుగా చేస్తున్నారు.
వైకుంఠ ద్వార దర్శనానికి...
ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరగనుంది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టిక్కెట్ల జారీ విధానంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. డిసెంబరు 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకూ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. మొదటి మూడు రోజులకు సంబంధించి ఆన్ లైన్ లో టిక్కెట్లను జారీ చేయాలన్న ఆలోచనలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉన్నారు. గత ఏడాది జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నేడు నిర్ణయం తీసుకోనున్నారు.
పన్నెండు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 71,208మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,135 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.84 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

